మన న్యూస్,తిరుపతి:
రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో పాటు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆదివాసీల సంక్షేమానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల పలు సంక్షేమ కార్యక్రమాలను ఆదివాసీల కోసం ప్రారంభించారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రవాణా సౌకర్యాలు లేని ఎన్నో ఆదివాసి గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఆయా ఆదివాసి ప్రాంతాలకు రహదారుల పనులు ప్రారంభమయ్యాయి అని చెప్పారు. వర్షాకాలం, శీతాకాలంలలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి వారికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల ఆదివాసి కుటుంబాలకు ఉచితంగా పాదరక్షలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో పాదరక్షలు పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఆదివాసీల జీవనోపాధి సంస్కృతి అభివృద్ధికి కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్ స్థానికంగా తయారు చేసే వస్తువులు హస్తకళలకు సరైన ధరలు రావాలని అందుకు తాము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. శ్రీకాకుళంలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో స్వయంగా ఆదివాసి చిత్రికలను ప్రోత్సహించారన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గిరిజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు ఆదివాసి మహిళలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.