
మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15
పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, సెట్టేరి గ్రామంలో ప్రజల ఆరోగ్య అవసరాల పరిరక్షణలో భాగంగా నూతనంగా నిర్మితమైన విలేజ్ ఆరోగ్య కేంద్రాన్ని "పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్" మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను ఆయన తనిఖీ చేసి వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడటమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సెట్టేరి వాసులకు మరియు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు నిత్యావసర వైద్యసేవలు కల్పించే ఉద్దేశంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే మెరుగైన సౌకర్యాలతో ఈ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం పరిశీలకులు బొమ్మన శ్రీధర్, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిశీలకులు ఎంపీ జయప్రకాష్ నాయుడు, బంగారుపాలెం మండల అధ్యక్షులు ఎంపీ ధరణి నాయుడు మరియు మండల నాయకులు, కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

