మన న్యూస్ పాచిపెంట, జూలై 15:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సాంప్రదాయ పద్ధతిలో వరి నాటే కంటే డ్రం సిడర్ ద్వారా నేరుగా వరి నాటుకుంటే అధిక దిగుబడులు వస్తాయని,ఖర్చు గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. మంగళవారం నాడు మండలం చెరుకుపల్లి గ్రామంలో రైతు యాళ్ళ ఈశ్వరరావు వేసిన డ్రం సీడర్ వరిని పరిశీలించారు.ఈ సందర్భంగా మండలంలో మొట్టమొదటిసారిగా డ్రమ్ము సీడరు వరి విధానాన్ని రైతు ఈశ్వరరావు ఆచరించడం ఎంతో అభినందనీయమని రైతులు ఈ విధానాన్ని పాటిస్తే ఎంతో సమయం తో పాటుగా సాగు ఖర్చులు కూడా తగ్గుతాయని దిగుబడులు కూడా 10 శాతం పెరుగుతాయని అన్నారు.
డ్రం సీడర్ విధానం : -ఈ విధానంలో వరి నాటుకునే రైతులు ఎకరానికి 8-10 కేజీల విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 12 గంటలు ఒక గోనెసంచులో కట్టి దానిపై కొద్దిపాటి బరువును ఉంచితే విత్తనం మొలక బయటకు కనిపిస్తుంది. ఇలా మొలకెత్తిన విత్తనాన్ని ముందుగా దమ్ము చేసి బాగా చదును చేసిన పొలంలో డ్రమ్ములో వేసి నాటుకోవాలన్నారు. నాటేటప్పుడు బురద పదును మాత్రమే ఉండేటట్లుగా చూసుకొని పొలం బాగా చదునుగా చేసుకోవాలి. నాటిన ఆరవ రోజున కలుపు మందు ఇసుకలో కలిపి చల్లుకోవాలి లేదా 15 రోజుల తర్వాత కొనోవేడర్ సహాయంతో లేదా కూలీల ద్వారా కలుపు తీయించుకుంటే వేరు వ్యవస్థ వద్ద గాలి సోకి మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు.
డ్రం సిడర్ ఉపయోగాలు:- ఎకరానికి 8 నుండి 10 కిలోల వరి విత్తనం సరిపోతుందని
సాగు ఖర్చులు సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే నాలుగు నుండి ఐదు వేల రూపాయలు ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. మూడు నుండి ఐదు బస్తాల అధిక దిగుబడి వస్తుందన్నారు. సమయం ఎంతో ఆదా అవుతుందని కూలీలపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు కేవలం ఇద్దరు మనుషులతో ఒక రోజులో మూడు ఎకరాలు పూర్తి చేయవచ్చు
నీటి వినియోగం బాగా తగ్గుతుందని తెలిపారు.
ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న డ్రమ్స్ సీడర్ వరి విధానాన్ని రైతులు అవలంబిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వ్యవసాయ అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు నాగమణి వినోద్ మరియు ఏఈఓ గణేష్ పాల్గొన్నారు.