గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర, జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె సోమవారానికి రెండో రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ కార్మికులు టెంట్లు లోనికి వెళ్లి కూర్చోవడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ జీ.ఓ. నెంబర్ 36 సంబంధించిన జీతాలు వర్తింప చేయాలని, 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని, ప్రభుత్వం సానుభూతి మాటలు కాకుండా నిర్దిష్టమైన హామీలతో, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్ చేశారు. కార్మికులు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో తమ పిల్లలను చదివించుకోలేక, ఇంటి బాడుగలు, కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితులలో పస్తులు ఉంటూ నానా ఇబ్బందులకు పడుతున్నామని, కనీసం సంక్షేమ పథకాలు, తల్లికి వందనం కూడా మాకు వర్తించడం లేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు సంఘ నాయకులతో చర్చలు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం కార్యదర్శి దారా కోటేశ్వరరావు, పి.భాస్కర్ వై.సుబ్రహ్మణ్యం, కె.పో లయ్య,ఎస్.కామేశ్వరరావు, ఎస్.కె.నయీం,సి.హెచ్. సుబ్బారావు,గూడూరు సి.ఐ.టి.యు పట్టణ ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.