చైతన్యపురి , మన న్యూస్ :- రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్ అన్నారు. శనివారం సరూర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేసారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్య నాణ్యత ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో లభించే సౌకర్యాలపై ప్రజలకు వివరించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి పాఠశాల ఆవరణను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. గురుకుల పాఠశాలలకు దీటుగా తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. నాణ్యమైన విద్య అందించడం కోసం తమ ప్రభుత్వం ఎంత ఖర్చయినా భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యున్నత మార్కులు సాధించి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సారధ్యంలో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు దూరంగా ఉండాలని తద్వారా ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కవిత, ఉపాధ్యాయులు మధుసూదన్, శేఖర్ రెడ్డి, నారాయణ, బాలనరేందర్, వెంకటేష్, పద్మ, రోజారమణి, మరియమ్మ, విజయశ్రీ, శోభారాణి, లలిత, భాగ్యమ్మ, రాధ, స్వర్ణలత, అరుణ, డాక్టర్ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.