మన న్యూస్,నారాయణ పేట జిల్లా : ఇరాన్ దేశంపై అమెరికన్ సామ్రాజ్యవాదులు చేసిన యుద్ధ దాడిని ప్రపంచ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కిరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇరాన్ పై అమెరిక, ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఈరోజు మక్తల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ సబ్ డివిజన్ కార్యదర్శి భగవంతు అధ్యక్షత వహించగా,టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏజీ భుట్టో, పి ఓ డబ్ల్యూ జిల్లా అధ్యక్షులు శారద, పి డి యస్ యు జిల్లా కార్యదర్శి అజయ్, పి వై ఎల్ జిల్లా నాయకులు మల్లేష్ మాట్లాడుతూ, మార్కెట్ ను జయించడం కోసం అమెరికన్ సామ్రాజ్యవాదులు తమ తొత్తు ప్రభుత్వాలను ఆసరా చేసుకొని మిగతా ప్రపంచ దేశాలపై దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆసియా ఖండంలో పట్టు సాధించడం కోసం ఇజ్రాయిల్, పాకిస్తాన్,దక్షిణకొరియాలను స్థావరాలుగా ఏర్పరచుకొని తనను ఎదిరించిన దేశాలపై యుద్ధాలు చేస్తుందని వారు అన్నారు. ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చికుక్కగా ప్రచారం చేయాలనే సామెత. ఈ సామెత ఆధారంగా అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ వద్ద అనుబాంబులు ఉన్నాయంటూ గత కొంతకాలంగా గోబెల్స్ ప్రచారం చేస్తూ ఇప్పుడు దాడులకు దిగారని ఆరోపించారు. అమెరికన్ సామ్రాజ్యవాదులకు ఇది వెన్నతో పెట్టిన విద్య అని, గతంలో సద్దాం హుస్సేన్ తదితరులు అందర్నీ కూడా ఈ విధంగా ప్రచారం చేసి చంపాలని కుట్రలు చేసిందని ఆరోపించారు. అను బాంబులు ఉంటే యుద్ధాలు చేయాలనుకుంటే మరి ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర వందల కొలది అనుబాంబులు ఉన్నాయని అమెరికానే చెప్పింది,మరి వారి మీద ఎందుకు యుద్ధం చేయట్లేదని ప్రశ్నించారు.దీని అర్థం అను బాంబులు కాదని తన చెప్పు చేతుల్లో ఉండని దేశాలను ఈ విధంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ ఇరాన్ వద్ద అనుబాంబులు ఉంటే అమెరికా చేసిన దాడులకు ఈపాటికి ప్రపంచ వ్యాప్తంగా రేడియేషన్ పెరగాల్సి ఉండే, కానీ ఇంతవరకు రేడియేషన్ ఏ మాత్రం లేదని యుఎన్ఓ ప్రకటించడాన్ని పట్టి చూస్తే అక్కడ అణు స్థావరాలు లేవని ప్రపంచానికి అర్థమైందని అన్నారు. పాలస్తీనా ప్రజల మీద ఉక్రెయిన్ ప్రజల మీద ఇజ్రాయిల్ దాడులు చేసినప్పుడు నోరు మెదపని భారత ప్రభుత్వం కూడా , తన దేశాన్ని రక్షించుకునే శక్తి ఇరాన్ కి ఉన్నదని నిరూపించుకునేటందుకు ఇజ్రాయిల్ మీద దాడి చేసిన వెంటనే ఆగ మేఘాల మీద మోడీ ప్రభుత్వం స్పందించిన తీరును బట్టి చూస్తే, భారత ప్రభుత్వం కూడా సామ్రాజ్యవాదులకు వత్తాసు పాడుతుందని అన్నారు. అందుకే భారత ప్రభుత్వం ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని డిమాండ్ చేసినారు. ఇజ్రాయిల్ అమెరికన్ సంయుక్త కుట్రతో ఇరాన్ పై దాడి చేయడాన్ని ప్రపంచ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. సామ్రాజవాదుల కుట్రలను, భారత ప్రభుత్వ ద్వంద్వ నీతి పరిపాలనను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ నాయకులు బుడ్డ కిష్టప్ప, మైమూద్, ఆనంద్, అయ్యప్ప, నాగన్న, రాజు, పాండు, మల్లేష్, కోరి రాము, గట్టపోల్లరాజు , నరసమ్మ , జ్యోతి తదితరులు పాల్గొన్నారు.