శంఖవరం మన న్యూస్ (అపురూప్):- ఎన్డీఏ కూటమి పరిపాలనలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు, ఇతరత్రా ప్రభుత్వ అధికారిక కార్యకలాపాల్లో జనసేన ఊసే ఉండటం లేదని పలు ఆరోపణలు గుప్పమంటున్నాయి. తాజాగా జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ స్వగ్రామైన కత్తిపూడిలో ఇదే జరిగింది. బుధవారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో పలు ఆభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొనగా జనసేన నేతలు ఎవరూ హాజరు కాలేదు... ఏంటని ఆరా తీస్తే జనసేన నేతలకు ఎవరికీ కబురు అందలేదని తెలుస్తుంది. బుధవారం నాటి కార్యక్రమంలో పాటించక పోవడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. శంఖవరం మండలం కత్తిపూడిలో ఏర్పాటు చేసిన 2 మినీ వాటర్ ట్యాంకులు, నిర్మాణం పూర్తయిన 1 సీసీ రోడ్డును ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ బుధవారం ప్రారంభించారు. అలాగే త్వరలో నిర్మాణం చేపట్టనున్న రెండు కాంక్రీటు సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసారు. తల్లికి వందనం లబ్దిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్ర పటాలకు పాలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రజలు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా నియోజకవర్గ జనసేన పార్టీ నేతలకు గాని పార్టీ శ్రేణులకు గానీ ఏ విధమైన ఆహ్వానం అందించలేదు. ప్రోటోకాల్ నూ పాటించలేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేనలో ఒక్క కత్తిపూడి గ్రామం నుంచే జనసేన పార్టీ ముఖ్య నేతలు అంతా ఉన్నారు. రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శిగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడుగా ఉన్న మేడిసెట్టి సూర్య కిరణ్ నియోజకవర్గ పార్టీ వ్యవహారాలు చూస్తుండగా, జిల్లా పార్టీ కార్యనిర్వహక కమిటీ సభ్యుడుగా కరణం సుబ్రహ్మణ్యం, మండల పార్టీ అధ్యక్షుడుగా గాబు సుభాష్, ఇదే గ్రామం నుంచి పార్టీకి, ప్రజలకూ విశేషమైన సేవలను అందిస్తున్నారు. అటువంటి ప్రాధాన్యత కలిగిన జనసేన నేతలు అంతా కత్తిపూడి స్థానికులే కావడం, ఇదే గ్రామంలో ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాహిత కార్యక్రమాలకు ఎన్.డి.ఏ. లో భాగస్వామ్య పార్టీయైన జనసేన నేతలను ఆహ్వానించక పోవడం ద్వారా తన స్వజనుల ముందే తమ సొంత నేతలను అవమాన పరచినట్లైంది. జరిగిన అవమానం పార్టీ శ్రేణులు గుప్పిస్తున్న ప్రజలకు నియోజకవర్గం జనసేన పార్టీ నేతల వద్ద తగు సమాధానం కరువైన పరిస్థితి ఎదురైంది. ఇటువంటి అవమానకర పరిస్థితి ఇక ముందు కూడా జరగకూడదంటే పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని నియోజకవర్గం జనసేన పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమాచారం. ప్రత్తిపాడు నియోజకవర్గం లో రానున్న పరిపాలనలో జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది వేచి చూడాల్సిందే మరి...