మన న్యూస్,తిరుపతి,:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో కార్పొరేషన్ డైరెక్టర్లు పలువురు శుక్రవారం రాష్ట్ర మంత్రులను కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిసి రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయడం గురించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనిపై మంత్రికి వినతిపత్రం అందజేయగా సానుకూలంగా స్పందించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలకు కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు . అలాగే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని కలిసి నాయి బ్రాహ్మణ అరాధ్య దైవం ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ను కలిసి నాయి బ్రాహ్మణులపై కుల దూషణలు పెరుగుతున్నాయని వివరించారు. కులం పేరుతో దూషిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలను కఠినంగా తీసుకునేలా చూడాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని చెప్పారు. నియోజకవర్గాల వారీగా నాయి బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని కోరుతూ గతంలో ఇచ్చిన జీవోలు 13, 14 అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వీటిపై మంత్రులు సానుకూలంగా స్పందించడం పట్ల నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్లు సురవరపు నాగరాజు, మద్దిరాల గంగాధర్ మున్నంగి శివ శేష గిరిరావు, లంక రత్న రావు , జి.సత్యనారాయణ , నిడమానూరు రమేష్ పుల్లేటికుర్తి రమేష్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు.