మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీకి చెందిన గ్రామస్తులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడ్ పంచాయతీ పరిధిలో పెద్దల నుండి సంక్రమించిన భూముల్లో కొంత భాగాన్ని అమ్ముకున్నారని, మిగిలిన భూములకు పాస్ పుస్తకాలు ఇప్పించాల్సిందిగా మంత్రి గారిని కోరారు. అలాగే, కొందరు అక్రమంగా ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి ఆ భూములపై హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు.ఈ నేపథ్యంలో మంత్రి గారు ఇరు వర్గాలను పిలిపించి వాస్తవాలు పరిశీలించి, పెద్దల కాలం నుండి హక్కు కలిగిన వారికి అధికారులతో మాట్లాడి పాస్ పుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాల సమస్యలను మంత్రి గారికి వివరించగా, వెంటనే అధికారులతో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామంతో బింగినపల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసి, మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.