మన న్యూస్, నెల్లూరు :- ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ - జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజిల్ పునఃప్రారంభానికి చెరో 50 లక్షల వితరణ - మంత్రి ఎంపీలకు ఘనంగా స్వాగతం పలికిన స్థానిక ప్రజలు- సీఎం చంద్రబాబు మైనారిటీల పక్షపాతి- అద్భుతంగా కడపలో మహానాడు నిర్వహణ ముస్లిం, మైనారిటీల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు సిటీ పరిధిలోని జనార్ధన రెడ్డి కాలనీలో షాది మంజిల్ పునఃప్రారంభానికి ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. షాదీ మంజిల్ పనుల ప్రారంభానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ. 50 లక్షలు, మంత్రి నారాయణ రూ.50 లక్షల సొంత నిధులు ఇచ్చారు. ముందుగా జనార్ధన్ రెడ్డి నగర్ కు చేరుకున్న అతిధులకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాలుగు చెత్త ఊడ్చే యంత్రాలను ప్రారంభించారు. అనంతరం షాదీ మంజిల్ పనులను టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఇందు కోసం కోటి రూపాయల చెక్కును నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ కి ఎంపీ, మంత్రి సంయుక్తంగా అందజేశారు. షాదీ మంజిల్ నిర్మాణానికి సహకరించిన మంత్రికి, ఎంపీకి స్థానిక ముస్లిం సోదర సోదరీమణులు జేజేలు పలికారు. ప్రజాసేవలో తరిస్తున్న నేతలకు మంచి జరగాలని ముస్లిం పెద్దలు దువా చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... 54వ డివిజన్ జనార్ధన్ రెడ్డి కాలనీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా షాది మంజిల్ నిర్మాణానికి సొంత నిధులు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ హామీని ఈ రోజు నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. ముస్లిం మైనార్టీ సోదరులు ఎన్నికల్లో ఎంతో కష్టపడి తమ గెలుపు కోసం పని చేశారని గుర్తు చేశారు. వారందరి సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని వెల్లడించారు. ఇటీవల కడపలో మహానాడు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగిందని, మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ కూలీల్లాగా కష్టపడ్డారన్నారు. నెల్లూరులో వేల కోట్ల అభివృద్ధి చేసిన ఘనత మంత్రి నారాయణదేనని కొనియాడారు. అభివృద్ధి కోసం పరితపించే మంత్రి నారాయణ ఉండటం మన అదృష్టమని అభినందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. మహానాడులో టీడీపీ మంత్రులు, అధ్యక్షుల క్రమశిక్షణ చూసానని, అయితే మాజీ సీఎం జగన్ వద్ద ఇలాంటి సిస్టమ్ లేదని ఎంపీ వేమిరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు ప్రతి ఒక్క పనినీ నిశితంగా పరిశీలిస్తారని, ఇలాంటి సీఎం వద్ద పనిచేయడం గర్వకారణమని వెల్లడించారు.మంత్రి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ..... నెల్లూరు 54 వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనిలో షాదీ మంజిల్ నిర్మాణ పనులు ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. 2014 -19 లో ఎవరూ అడగకుండానే నెల్లూరును రూ.5250 కోట్లతో అభివృద్ది చేసామని చెప్పారు. తద్వారా పురిటిగడ్డ రుణం కొంతమేర తీర్చుకున్నానని తెలిపారు. 2024 ఎన్నికల్లో మైనారిటీ సోదరులు తనకు ఎంతో అండగా నిలిచారని మంత్రి నారాయణ గుర్తు చేశారు. జనార్ధన్ రెడ్డి కాలనీలో గత ప్రభుత్వం ఆపేసిన షాదీ మంజిల్ పనులను తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. 2019 లో కోటిరూపాయ కార్పొరేషన్ నిధులతో షాదీమంజిల్ పనులు ప్రారంభించామని, అయితే ఆ పనులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిపివేసిందన్నారు. గత పాలకులు అభివృద్ధి పనుల విషయంలో శాడిజాన్ని చూపించారని మండిపడ్డారు. పరిపాలన చేతకాక రాష్ట్రంలో వ్యవస్థలన్నింటిని గత ప్రభుత్వ అస్తవ్యస్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారని దుయ్యబట్టారు. షాదీ మంజిల్ నిర్మాణానికి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎన్నికల్లో హామీ ఇచ్చామని, ఆ మేరకు చెరో యాభై లక్షల రూపాయలు విరాళం ఇచ్చి కోటి రూపాయలతో పనులను ఈరోజు పునః ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు అదనంగా నిధులు అవసరం అయితే కార్పొరేషన్ ద్వారా కానీ వక్ఫ్ బోర్డు ద్వారా కానీ సమకూరుస్తామని తెలియజేశారు. అన్నీ హంగులతో సర్వాంగ సుందరంగా అక్టోబర్ లోపు షాదీ మంజిల్ పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కానీ భగత్ సింగ్ కాలనీ వాసుల సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిష్కరించారని కొనియాడారు. నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..... టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసిన షాదీమంజిల్ నిర్మాణాన్ని వైఎస్సార్సీపీ పనులు ఆపేసిందని వ్యాఖ్యానించారు. నేతల విరాళంతో పాటు కార్పొరేషన్ నిధులు కలిపి రెండు కోట్లతో షాదీ మంజిల్ నిర్మాణం ప్రస్తుతం జరుగుతుండడం శుభ సూచికమన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ లాంటి మంచి మనసున్న నేతల కలయిక అరుదైనదని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే అనీల్ చేయలేని పని ప్రస్తుత మంత్రి నారాయణ చేసి చూపించారన్నారు. భగత్ సింగ్ కాలనీలోని 1400 మందికి శాశ్వత ఇంటిపట్టాలు మంజూరు చేయించారని తెలియజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో ఎంపీ, మంత్రికి ఎవరూ సాటిలేరని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిప్యూటీ మేయర్ తహసీన్, మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనూరాధ, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు , నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు , టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి, నగర మైనారిటీ కమిటీ అధ్యక్షులు ఇక్బల్ ,స్థానిక కార్పొరేటర్ షఫియా బేగం ,క్లస్టర్ ఇంచార్జి జహీర్ ,కో అప్షన్ సభ్యులు జమీర్, తదితరులు పాల్గొన్నారు.