మన న్యూస్,తిరుపతి, :
తాము టీటీడీ పాలకమండలి సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమలలో అవినీతి అక్రమాలను ప్రక్షాళన చేసి అనేక మార్పులు తీసుకొచ్చామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యులు వైద్యం శాంతారాం నరేష్ కుమార్ లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యం శాంతారాం, నరేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు సకాలంలో శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్యూ లైన్ లలో కూడా భక్తులకు ఆల్పాహారంతో పాటు పాలు ఇతర ఆహార పదార్థాలు సకాలంలో అందజేస్తున్నామని గుర్తు చేశారు. కాకినాడకు చెందిన వైసిపి నాయకుడు పథకం ప్రకారం భక్తులు మనోభావాలు దెబ్బతీసేలా నినాదాలు చేశారని ఇదంతా వైసిపి పెద్దల కనుసనల్లో జరుగుతోందని పేర్కొన్నారు. క్యూలైన్లలో రద్దీ ఎక్కువగా ఉన్న రోజులలో టీటీడీ చైర్మన్ తో పాటు తాము ఈవో అదనపు ఈవో లు వెళ్లి భక్తుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించే దిశగా చొరవ చూపుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో తిరుమలలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, భక్తులకు సులభతరంగా శ్రీవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమలలో ఎలాంటి మైనస్ కనపడకపోవడంతోనే హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు వైసిపి టార్గెట్గా పెట్టుకుందని ఆరోపించారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో 2000 మంది నిఘా నేత్రాలు తమకు అనుకూలంగా ఉన్నారని చెప్పడం వెనుక పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. వైకుంఠ ఏకాదశి ముందు రోజు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో కూడా వైసిపి హస్తం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. గోశాలలో గోవుల మరణాలపై కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేశారని, రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయి అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఆలయాలు ధ్వంసం చేసి విగ్రహాలను పగలకొట్టి ఆలయాల రథాలను పగలగొట్టారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఎందుకు తిరుమలను టార్గెట్ చేశారని ప్రశ్నించారు. తమ టిటిడి పాలక మండలి లో అవినీతి జరిగి ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు. తిరుమల వెంకటేశ్వర స్వామి తో పరాచకాలు ఆడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకునేలా వచ్చే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అని ఆయనపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. హిందుత్వం పై దాడి చేస్తే దేశ ప్రజలే బుద్ధి చెబుతారని, తిరుమల కొండపై జరుగుతున్న కుట్రలపై టీటీడీ విజిలెన్స్, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కొత్త వైసిపి ప్రభుత్వం లో తిరుమలను టూరిజం స్పాట్ గా చేయాలని చూశారని, గతంలో తమిళనాడు తెలంగాణ టూరిజం బస్సుల్లో శ్రీవారి దర్శనం టికెట్లు ఇచ్చారని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే ఎవరైనా తగిన మూల్యం చెల్లించాలి వస్తుందని వైసిపి నేతలకు హెచ్చరించారు.