మన న్యూస్, నెల్లూరు:- నెల్లూరు నగర పాలక అధికారులతో మంత్రి సమీక్ష - ప్రస్తుత సీజన్ ను బట్టి తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలు- అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలి- రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న అధికారుల పనితీరుకు నిదర్శనంగా నెల్లూరు నగరాన్ని అన్ని విధాల సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఓ ప్రణాళిక ప్రకారం వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు, ఎంతవరకు పనులు జరుగుతున్నవి తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజల అభిష్టానికి అనుగుణంగా ఇంకా చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు కాలవల్లో ఎక్కడ నిలువ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. పలుచోట్ల వర్షపు నీరు నిలిస్తే నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇంకా పలు విషయాలపై మంత్రి నారాయణ నెల్లూరు నగరపాలక అధికారులకు సూచనలు సలహాలు అందజేశారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజల ఆశలకు అనుగుణంగా సుపరిపాలన అందించడమే తన లక్ష్యమని మంత్రి నారాయణ ఘంటాపధంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు..ఇంజనీరింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.