మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలంలోని పలు పంచాయతీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన చిన్నారులు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల ఆధార్ కార్డులు తీసుకోవడంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా వారు అంగన్వాడి, ప్రాథమిక పాఠశాలల్లో నమోదు కావడంలోనూ, రేషన్ కార్డుల్లో చేరడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనన ధ్రువీకరణ పత్రాలపై అవగాహన లేకపోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, బీసీ నాయకులు వేల్పుల వెంకటరావు, నర్రా రాంబాబు తదితరులు గుర్తించి, మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన మంత్రిగారు తహసీల్దార్, ఆర్డీవోలతో మాట్లాడి జనన ధ్రువీకరణ పత్రాల మంజూరుకు మార్గం సుగమం చేశారు. ఈ చర్యతో చిన్నారులకు ఆధార్ కార్డులు పొందడంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం లభించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి స్వామి గారికి కృతజ్ఞతలు తెలిపారు.