మన న్యూస్ సింగరాయకొండ:- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి శానంపూడి గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీ, మిట్టమీద పాలెం నుండి ఐదవ తరగతిలో ప్రవేశం పొందిన దాసరి ప్రణీత, వెలిశాల లిఖిత, కంచర్ల అమృత వర్షిణి, దార్ల సంయుక్త, కూతల ప్రదీప్తి అనే ఐదు మంది బాలికలను హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలికలకు విద్యార్థి దశలో తొలి పోటీ పరీక్షగా గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు నిలుస్తాయని, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు సమతుల్యమైన పౌష్టికాహారం కూడా అందుతుందని తెలిపారు. ఈ సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో గురుకుల బాలికలు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచారని గుర్తు చేశారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కృషి, ఓపిక, దృఢ సంకల్పం అవసరమని సూచించారు.నాలుగో తరగతి నుంచే బాలికలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు గురుకుల పాఠశాల ప్రాముఖ్యత వివరించామని, విద్యాపరంగా ప్రోత్సహిస్తూ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసినట్లు తెలిపారు. మధ్యలో విద్యా ప్రమాణాలను పరీక్షించడం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగారని పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన శానంపూడి ఉన్నత పాఠశాల అధ్యాపక సిబ్బందికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.