మన న్యూస్ సింగరాయకొండ:-
పాకల గ్రామంలో నేడు సీజనల్ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు మరియు హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించే కళాజాత కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
కళాజాత బృంద సభ్యులు పాల్గొని, హెచ్ఐవి వ్యాధి ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా మాత్రమే సోకుతుందని వివరించారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషితమైన రక్త మార్పిడి, శుభ్రపరచని సూదులు, సిరంజీలు వాడడం, హెచ్ఐవి సోకిన తల్లి నుండి బిడ్డకు
ఈ నాలుగు మార్గాల ద్వారా తప్ప హెచ్ఐవి ఇతర మార్గాల్లో సోకదని స్పష్టం చేశారు. అలాగే, హెచ్ఐవి ఉన్న వ్యక్తుల పట్ల వివక్షత, చిన్నచూపు చూపకూడదని, వారి హక్కులను కాపాడేందుకు భారత ప్రభుత్వం 2017లో హెచ్ఐవి/ఎయిడ్స్ చట్టాన్ని అమలు చేస్తోందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక లింక్ వర్కర్ రెబ్బవరపు భాస్కర్ పాల్గొన్నారు. గ్రామస్థులు, యువత, మహిళలు పాల్గొని అవగాహన పొందారు.