
Mana News :- నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులను గుర్తించి సీజ్ చేయాలనీ, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దు అని జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS గారు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అధికారులు అందరూ సమన్వయంగా పని చేసి రైతులకు నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు సరఫరా జరగకుండా చూడాలి అని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి ముఖ్యమైన ఆధారం వ్యవసాయం అని అలాంటి వ్యవసాయం చేసి, ఆరుగాలం కష్టపడే రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా విత్తన సంస్థలు, డీలర్లు, వ్యాపారులపై ఉన్నదని, విత్తన వ్యాపార డీలర్స్ బాధ్యతగా మంచి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి అని అన్నారు. రైతులకు, వ్యవసాయానికి నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే అలాంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని, పి.డి యాక్ట్ తప్పదని, షీట్స్ నమోదు చేస్తాం అని హెచ్చరించారు. నారాయణపేట జిల్లా కర్ణాటక రాష్ట్రానికి ముఖ్య సరిహద్దుగా ఉన్నది ఇక్కడ నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉన్నది, ముందస్తు తనిఖీలు, రైతులకు అవగాహన కల్పించడం, డీలర్స్ కు అవగాహన కల్పించడం, సరిహద్దు లలో పటిష్టమైన నిఘా తో నకిలీ విత్తనాలు నివారించాలి అని ఎస్పీ గారు అన్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి చైతన్య పరచాలి, గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్నవారి పై నిఘా ఉంచాలి అని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. నాణ్యమైన కంపెనీ విత్తనాలు ఎంచుకోవాలి, లేబుళ్లు, ప్యాకింగ్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దు అని కోరినారు, తక్కువ ధరకు వస్తున్నాయని గ్రామాల్లోకి వచ్చే మద్యవర్తుల వద్ద విడి విత్తనాలు కొనుగోలు చేయవద్దు, ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్స్ నుండి విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాల లనుండి ఎక్కువ మొత్తంలో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని కోరినారు. నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి పోలీసు వారికి ( డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్) లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి అని ఎస్పీ గారు కోరారు.
