
Mana News :- ఉర్సా...ఇప్పుడు ఏపీలో చర్చగా మారిన పేరు. రాజకీయ రచ్చ సాగుతున్న పేరు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఉర్సా సంస్థ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే, ఉర్సా సంస్థ పెట్టుబడులు... ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం అసలు ఈ సంస్థ పూర్వా పరాలు తెలుసు కోకుండానే ఆమోదం ఇచ్చిందా. కేశినేని నాని ఆరోపణల్లో నిజం ఉందా. అసలు ఈ ఉర్సా సంస్థ ఎవరిది. తెలుగు రాష్ట్రాల్లో వారి లక్ష్యం ఏంటి. తెర వెనుక ఏం జరుగుతోంది.. ఉర్సాపై విష ప్రచారం..? ఏపీ వాణిజ్య నగరం విశాఖ తీరాన్ని ఐటీ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా టీసీఎస్ కు ప్రభుత్వం అతి తక్కువ ధరకే భూములు కేటాయించింది. దీని ద్వారా ఐటీ ఆధారిత పరిశ్రమలను ఆహ్వానించటం అసలు లక్ష్యం. అందులో భాగంగానే ఏపీలో రూ 5,728 కోట్ల పెట్టుబడి తో ఉపాధి కల్పించేందుకు అమెరికా బేస్డ్ కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ఏపీ ప్రభుత్వంతో చర్చలు చేసింది. ఈ సంస్థ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం అన్నీ పరిశీలన చేసిన తరువాత ఐటీ పార్క్లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 56.36 ఎకరాలు భూములు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ సంస్థ గురించి వైసీపీతో పాటుగా మరి కొంత మంది ప్రచారం మొదలు పెట్టారు. సంస్థ పూర్వా పరాలు తెలియకుండా ఈ తరహా ప్రచార జోరు పెంచారు. తాము ఎకరా భూమిని 99 పైసలకు కొనుగోలు చేయలేదని, 3.5 ఎకరాలకు ఎకరం చొప్పున రూ.1.5 కోట్లు, మిగతా 56 ఎకరాలకు ఎకరానికి రూ.50 లక్షలు చెల్లించేందుకు ముందుకొచ్చామని ఉర్సా సహ వ్యవస్థాపకులు సతీష్ అబ్బూరి క్లారిటీ ఇచ్చారు.ఇక తమ సంస్థను స్థాపించే సమయంలో ఇండస్ట్రీ నిపుణులు పలువురు సర్టిఫై చేశారని, అదే సమయంలో ప్రభుత్వ సంస్థలు కూడా అన్ని గైడ్ లైన్స్ సక్రమంగా ఉన్నాయా లేదా అని చెక్ చేశాకే అనుమతులు ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. తమ కంపెనీ డొల్ల కంపెనీ కాదని చెబుతూ వారి టీమ్ గురించి సతీష్ అబ్బూరి విడుదల చేసిన ప్రెస్ నోట్లో వివరించారు. అనుకున్న ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని ఇందుకు కట్టుబడి ఉన్నట్లు సతీష్ వివరించారు.ఇది ఒక్క డేటా సెంటర్తో ఆగదని చాలా డేటా సెంటర్లను ఏర్పాటు చేసేంత మ్యాన్ పవర్, ప్రమోటర్స్ ఉన్నారని స్పష్టం చేశారు. ఒక్క ఆధారమైనా ఉందా..? తాజాగా మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు చిన్ని లక్ష్యంగా చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ఈ సంస్థకు కేటాయింపుల పైన ట్వీట్ చేసారు. అయితే, ఇప్పుడు సంస్థ ప్రతినిధులు ఈ అంశం పైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది అంతా విష ప్రచారంగా కొట్టి పారేస్తున్నారు. ఉర్సా డొల్ల కంపెనీ అనేందుకు ఒక్క ఆధారమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. వామపక్షాల నేతలు సైతం వైసీపీ ట్రాప్ లో పడుతున్నారని పేర్కొన్నారు. మాతృ భూమికి మేలు చేయాలని ముందుకు వస్తున్న ఎన్నారై లపై ఇంత ద్వేషమేందుకని నిలదీస్తున్నారు. రాజకీయం ఎందుకు..? తమ సంస్థ ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని కంపెనీలు తెస్తుంటే ఇంత కక్ష ఎందుకని ఉర్సా సంస్థల ప్రతినిధుల ప్రశ్న. టీసీఎస్ కి భూములు లీజుకు ఇవ్వడంపైనా ఇదే తరహాలో విష ప్రచారం చేసారని మండిపడుతున్నారు. రాజకీయం కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి కంపెనీలను అడ్డుకోవడాన్ని ఏమనాలని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి కంపెనీలు తెస్తుంటే వైసీపీకి ఎందుకు అంత పగ అని ప్రశ్నిస్తున్నారు. ఉర్సాకు అమెరికా బేస్డ్ కంపెనీగా గుర్తింపు ఉందని చెబుతున్నారు. వివిధ అమెరికన్ ఐటీ కంపెనీలకు చెందిన డైరెక్టర్లతో ఈ ఉర్సా స్థాపించినట్లు వెల్లడించారు. ఈ సంస్థలోని డైరెక్టర్లు అందరూ అమెరికాలో ఉన్న స్థానాల్లో స్థిరపడిన వారనేని.. అమెరికన్ ఐటీ కంపెనీల్లో వేల కోట్లు టర్నోవర్ సాధిస్తున్న వారని పేర్కొన్నారు. విదేశీ బేస్డ్ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే....ఇక్కడ కార్పొరేట్ తరహా ఆఫీసులు తెరవడం రాత్రికి రాత్రే సాధ్యమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.
