
మాన న్యూస్, నారాయణ పేట:- జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట కూరగాయల మార్కెట్ రోడ్డులో ఉన్న ఎస్.ఆర్.గార్డెన్స్ లో మే 3వ తేదీ శనివారం ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నమని తెలిపారు. భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను నారాయణపేటలో ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. నారాయణపేట జిల్లాలో చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు, ఉపాధి లేక అనేక మంది యువతీ యువకులు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తెలుసుకుని వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 25 ప్రముఖ ఎం.ఎన్.సీ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. నారాయణపేట జిల్లాలో ఉన్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ మెగా జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గోపాల్ గౌడ్, రుద్రారెడ్డి, హనుమంతు, వై.సంతోష్, శివరాజ్, ఎం.సంతోష్, నరేష్ గౌడ్, ప్రవీణ్, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
