మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 12 :- గోవుల సహజ మరణాలపై కుట్రలు ఆపాదించవద్దు. - టిటిడి పై దుష్ప్రచారానికి పాల్పడే వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. - టిటిడి పాలక మండలి సభ్యురాలు మరియు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించాలని ప్రయత్నించిన వారెవరైనా ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు టిటిడి పాలక మండలి సభ్యురాలు మరియు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. వృద్ధ్యాప్యం కారణంగా టిడిడి గోశాలలో గోవుల సహజ మరణాలపై దుష్ప్రచారం చేస్తున్న వైసిపి నాయకుల వాఖ్యలను ఆమె ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. టిటిడి గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న కరుణాకర్ రెడ్డి మాటలు పచ్చి అబద్ధాలన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి . ఎక్కడో చనిపోయిన గోమాతల ఫోటోలను మార్ఫింగ్ చేసి టిడిడి గోశాలపై దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని ఆమె మండి పడ్డారు. కోటి మంది దేవతలకు సమానమైన గోమాతలపై దుష్ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. టిటిడి గోశాలలో గోవుల పరిరక్షణ మరియు సంరక్షణ కోసం దాదాపు 260 మంది పని చేస్తుంటారని, వృద్ధ్యాపం కారణంగా గోవుల సహజ మరణాలు సర్వ సాధారణ విషయమని ఇందులో భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గోవుల సహజ మరణాలపై అసత్య ప్రచారాలు చేస్తూ టిటిడి ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై చట్టపర తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.