మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,భారాస రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ నిజామాబాద్, జిల్లాల ముఖ్య నేతలతో బుధవారం ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ నెల 27న జరగనున్న భారాస రజతోత్సవ సభ ఏర్పాట్లపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మహాసభ ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలన్నారు.మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని నేతలకు సూచించారు.
ఈ సమావేశంలో భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి,గణేశ్ గుప్తా,జాజుల సురేందర్,హన్మంత్ షిండే, గంప గోవర్ధన్ ,నేతలు అయేషా ఫాతిమా, ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.