మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పిడికి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు వినతిపత్రం అందజేశారు. పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో పిడి చైత్ర వర్షిణిని కలిసి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు సమస్యలు వివరించారు. గొల్లప్రోలు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రైన్ లు ఆధునీకరించి వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అర్ధాంతరంగా నిలిచిపోయిన సూర్యుడు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు మరలా ప్రారంభించి పనులు పూర్తి చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చేవారి సౌకర్యం కోసం సులబ్ కాంప్లెక్స్ లు నిర్మించాలని, బైపాస్ రోడ్డు నుండి పట్టణం మీదుగా తిరిగి బైపాస్ చేరేవరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని, నగర పంచాయతీ గ్రంథాలయం పునరుద్ధరించాలని, పట్టణ పరిధిలోని ఏడు సచివాలయాలకు సర్వేయర్ లను నియమించాలని, పొలాల నుండి పంటను తీసుకువచ్చేందుకు వీలుగా పుంత రోడ్లు నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న కలింగల్ లు, రెగ్యులేటర్లకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు ఏలేరు, పిబిసి కాలువలకు పడిన గండ్లను పూడ్చి వేయాలని పిడిని కోరారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ గొల్లప్రోలు కన్వీనర్ కొశిరెడ్డి రాజా, సభ్యులు కొమ్ము సత్యనారాయణ, పెదిరెడ్ల వెంకట్రాజు, కర్రి కొండలరావు, కీర్తి ఆదినారాయణ, చోడపునీడి పుల్లపురాజు, జ్యోతుల శివ తదితరులు పాల్గొన్నారు.